జేబులో డబ్బులు లేకున్నా ఇకపై సిటీ బస్సులు ఎక్కొచ్చు! మీవద్ద చలో కార్డు మీ దగ్గర ఉంటే చాలు! అవును ఇదో రకం మనీ వ్యాలెట్ కార్డు! సిటీ బస్సు కండక్టర్ల వద్ద ఈ కార్డును నేటినుంచి ప్రయాణికులు ఉచితంగా పొందవచ్చు. ఆయనకే నచ్చినంత నగదు ఇచ్చి వెంటనే రీచార్జి చేసుకుంటే చాలు! దీంతో ఈ చలో కార్డు ద్వారా కండక్టర్కు డబ్బులు చెల్లించకుండానే కార్డు చూపి ప్రయాణం చేయవచ్చు. కండక్టర్ తన టిమ్ మిషన్లో ఈ కార్డును స్వైపింగ్ చేయటం ద్వారా మీ వ్యాలెట్లో ఉన్న మొత్తం నుంచి ఆటోమేటిక్గా చార్జీ కట్ అవుతుంది. చిల్లర సమస్య కూడా ఉండదు. ప్రయాణికుడు తన ఏటీఎం కార్డుల వ్యాలెట్లో ఇక మీదట చలో కార్డును కూడా పెట్టుకోవచ్చు. సాంకేతిక బాటలో విప్లవాత్మక అడుగులు వేస్తున్న రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఏ ప్రయోగం చేసినా ముందుగా కృష్ణాజిల్లాలోనే చేపడుతుంది. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నగదు రహిత చెల్లింపులకు సంబంధించి స్మార్ట్ చలో కార్డుల విధానాన్ని కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా.. ప్రధానంగా విజయవాడ నగర పరిధిలోని గన్నవరం, ఉయ్యూరు, గవర్నర్ పేట-1, గవర్నర్ పేట-2, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్ డిపోల పరిధి బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం చలో సంస్థతో ఆర్టీసీ ఎంవోయూ చేసుకుంది. ఈ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా విజయవాడలో నగదు రహిత చెల్లింపులను ప్రారంభించారు.
డబ్బులు లేకున్నా.. సిటీ బస్సులు ఎక్కొచ్చు! అదెలాగో తెలుసుకోండి